Tuesday, February 26, 2019

చచ్చేది మనం కాదుకదా.... ఎన్ని యుద్దాలైనా కోరుకుంటాం.....


‘జీ న్యూస్‌’ చర్చాగోష్టిలో పాల్గొన్న 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్‌ యుద్ధంలో పాల్గొని కుడి కాలును కోల్పోయిన యోధుడు మేజర్‌ నవదీప్‌ సింగ్:

"దేశ త్రివర్ణ పతాకానికి అండగా ప్రాణాలర్పించేందుకు ప్రతి సైనికుడు సిద్ధంగానే ఉన్నారు. ఒకప్పుడు టెర్రరిస్టయిన నజీర్‌ వానిలాగా ఓ కశ్మీర్‌ యువకుడు ఎందుకు కావాలనుకుంటున్నాడో కూడా ఆలోచించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. యుద్ధం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ప్రాణాలే కాదు, అవయవాలు కూడా పోతాయి. ఆ తర్వాత నష్ట పరిహారం కోసం కోర్టుల తలుపులు తట్టాలి.

యుద్ధంలో సైనికుడు చనిపోవాలని మనం కోరుకుంటాం. ఆ తర్వాత ఆ సైనికుడి వితంతు భార్య పింఛను కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. యుద్ధంలో కొన్నిసార్లు మృతదేహం ఆనవాళ్లు కూడా దొరకవు. పింఛను కావాలంటే భర్త మతదేహాన్ని తీసుకరావాలని అధికార యంత్రాంగం ఆదేశిస్తుంది. యుద్ధంలో గాయపడితే అంగవైకల్య నష్టపరిహార పింఛను కోసం ఏళ్లకు ఏళ్లు కోర్టుల చుట్టూ తిరగాలి. యుద్ధంలో కాలు కోల్పోయిన నేను పింఛను కోసం ఏడేళ్లు కోర్టుల చుట్టూ తిరిగాను. సైనిక పింఛను విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్పీళ్లను ఉపసంహరించుకోవాల్సిందిగా సుప్రీం కోర్టు స్వయంగా ఆదేశించినప్పటికీ ఇప్పటికీ వెయ్యి కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రాణాలతో పరాచకాలొద్దు. అన్యాయంగా సైనికుల ప్రాణాలను బలిపెట్టవద్దు. భారత సైన్యానికి ఎప్పుడు ఎలా స్పందించాలో తెలుసు. ఎం చేయాలో వారికి మనం సూచించాల్సిన అవసరం లేదు. సముచిత సమయంలో సముచిత చర్య తీసుకోవడం వారికి తెలుసు. ముందుగా పాకిస్థాన్‌ను టెర్రరిస్టు దేశంగా ప్రపంచం ప్రకంటించేలా దౌత్యపరమైన ఒత్తిడి తీసుకరావాలి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందిగదా అంటూ ఆవేశంతో మాట్లాడడం సముచితం కాదు"

అవును. చచ్చేది మనం కాదుకదా.... ఎన్ని యుద్దాలైనా కోరుకుంటాం.....

Friday, February 15, 2019

మర్డర్లు చేస్తే స్వర్గం నీకు ఫ్రీ.. ఫ్రీ... ఫ్రీ...

నిన్న కాష్మీర్ లో ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాది వీడియో చూశాక.. మనవాళ్ళు ఎప్పుడో చెప్పిన "వశీకరణ విధ్య" ఆ ఉగ్రవాద లీడర్లు బాగా బట్టీపట్టేసివాడుతున్నట్టున్నారు. భహుశా అల్లప్పుడెప్పుడో మన గ్రంధాలు విదేశీయులు కొట్టూకుపొయ్యారని మనం ఏడుస్తున్న తాలూకు ఐయ్యుంటుంది. అంతమందిని వశీకరణం చేసుకోని.. చావుకుకూడా రెడీ చేస్తున్నారంటే.. అది వారి గొప్పతనమంటే మాత్రం ఎవ్వడూ ఒప్పుకోడు. ఏదైనా ఇక్కడి గ్రంధాల్లోనివే మరి..

ఇంతకీ ఆ ఉగ్రవాది ఏం చెప్పడంటే "వీల్లని చంపి స్వర్గానికెల్తున్నాను" అని.

     అస్సలు వీల్లు స్వర్గం కోసం ఎందుకంత పాకులాడుతున్నారు? దానికోసం ఎంత నీచమైన పనులైనా ఎందుకు చేస్తున్నారు?

    వారి పెద్దలు లేదా మత నాయకులు చెప్పేదేమంటే.. "నువ్వెంతమందిని చంపితే, నీకంతమంది పెళ్ళాల్ని స్వర్గంలో అల్లా రెడీ చేస్తాడు. తాగు.. తిను.. పండగ చేస్కో..". ఇదీ మరి స్వర్గమంటే. కొంచెం అటు ఇటుగా అన్ని మత స్వర్గాల్లో ఇదే ఉంటుంది.. మరి ఆడోల్లు చచ్చి స్వర్గానికెల్తే.. సేం టు సేం.. అవే ఫెసిలిటీస్ వాల్లకి కూడా ఉంటాయా? ఆ విషయం ఏ మతం చెప్పదు. ఎందుకంటే.. వాల్ల వాల్ల మతాల్లో ఆడదంటే వాల్లకి ఒక బే....ద్ద... గౌరవం.

    నువ్వు తాగి, తిని, అమ్మాయిలతో తిరుగుతుంటే.. తల్లిదండ్రులు నీ కాల్లిరగొడతారు. మరి అదే ఫెసిలిటీస్ ఇచ్చే దేవుడికి ఏం పేరు పెడదాం?  

Thursday, February 14, 2019

"మత బోధకులు సైన్సు చదువుకుంటే మంచిది" - డాక్టర్‌ దేవరాజు మహారాజు

'అన్నీ వేదాల్లో ఉన్నాయష'- అని ఎవరైనా మాట్లాడితే వారివి పిచ్చి మాటలే అవుతాయి. ఆ కాలానికి ఉన్న అవగాహన, పరిజ్ఞానం మాత్రమే అందులో ఉన్నాయి. తర్వాత, అత్యాధుని కంగా మనిషి అంతరిక్షంలో సాధిస్తున్న విషయాలు అందులో లేవు. గణితానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి జోడీ కుదిర్చి సమకూర్చుకున్న విజ్ఞానం-పురాణాలలోనూ, వేదాలలోనూ, ఇతర ఏ మత గ్రంథాలలోనూ లేదు. ఇది వాస్తవం. సమకాలీనంలో బాలబాలికలకు, సామాన్య పౌరులకు ఉన్న వైజ్ఞానిక అవగాహన ప్రాచీన మేధావులకు ఉండి ఉండదు. ఆ సమాజాలకు వారు గొప్ప జ్ఞానులై ఉండొచ్చు. కానీ నేడున్న మేధాశక్తికి వారు సరితూగరు. ప్రాచీనులు మనకు గౌరవనీయులు. వారు కొన్ని ప్రాథమిక అంశాలను మనకు అందించింది నిజమే అయినా, ఈ కాలంలో విద్యావంతుడైన ఒక సామాన్య పౌరుడికి ఉన్న అవగాహన, ఆనాటి మేధావులకు లేదు. తప్పు వారిది కాదు. వారు జీవించిన సమాజ స్థాయే అలాంటిది. అలాగని వారి కృషిని తక్కువ చేయడం ఏమాత్రం కాదు.

సమాజం మారిపోయింది. సమాజ అవసరాలు మారిపోయాయి. ఆ రాజులూ, ఆ రాజ్యాలు, కత్తులు, బల్లాలు, గుర్రాలు, తోపులూ అన్నీ మాయమై పోయాయి. ఇక్కడ ప్రయోగిస్తే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దేశాన్ని భస్మీపటలం చేసే అణ్వాయుధాల యుగంలో ఉన్నాం. వందేళ్ల కిందట పొద్దున్నే లేచి అమరం చదివేవాడు, గాయత్రీ మంత్రం, హనుమాన్‌ చాలీసా పఠించేవాడు జ్ఞాని, పండితుడుగా చలామణి అయ్యాడు. ఇప్పుడవి పనికి రానివయ్యాయి. విద్యావంతుల సంఖ్య పెరిగింది. ఆలోచనాపరులు ఎక్కువయ్యారు. పిల్లల విజ్ఞానం, ప్రతిభ చూస్తుంటే పెద్దలే హడలిపోతున్నారు. నేను చూసిన కొందరు పిల్లలున్నారు. మొదట, టీచరు వారికి పదుల్లో 20 సంఖ్యలు చెప్పారు. ఆయన చెప్పడం ఆపగానే వారు ఆ సంఖ్యలు మొత్తం చెప్పేశారు. కాలిక్యులేటర్‌ నొక్కుతూ కూర్చున్న వాళ్లు సైతం అంత త్వరగా చెప్పలేరు. ఆ తర్వాత టీచర్‌ వందల్లో యాభై సంఖ్యలు చెప్పారు. ఎంతో ఉత్సాహంగా వారు, వాటి మొత్తం టక్కున చెప్పేశారు. తర్వాత అదే కూడిక వేలల్లో జరిగింది. పలకా బలపం కానీ, పెన్నూ కాగితం కానీ ఉపయోగించకుండా, ఊరికే వింటూ మెదడులోనే కూడికలు చేసుకుంటూ చెప్పారా పిల్లలు. గణితంలో ఇంత అద్భుతమైన శక్తి పూర్వకాలంలో ఎవరికీ ఉన్నట్టు మనం వినలేదు. ఈ ఆధునిక కాలంలోనే శకుంతలా దేవి పేరు విన్నాం. కానీ పదేళ్ల పిల్లలో ఇంత 'తెలివి' ఉండడం మామూలు విషయం కాదు. వాళ్లు దేనికైనా ఘనం, ఘన మూలం కూడా చెప్పేశారు.
ఇక కళల విషయానికొస్తే, యాభై యేళ్ల క్రితం, తన ఇరవయ్యోయేట ఓ ప్రసిద్ధ గాయని పాడిన పాటను ఇప్పుడు పదేళ్లలోపు పిల్ల అచ్చు అలాగే పాడగలుగుతోంది. అంటే కొత్త తరాలు ఎంత మేధోశక్తితో, కళా సంపత్తితో ఉన్నాయో మనం గమనించవచ్చు. నాకో అబ్బాయి తెలుసు. వాడికి నాలుగు సంవత్సరాలు. సుమారు డెబ్బయి దేశాల రాజధానుల పేర్లు చెబుతున్నాడు. గ్రహాలపేర్లు, ముఖ్యమైన వైజ్ఞానిక ఆవిష్కర్తలైన శాస్త్రజ్ఞుల పేర్లూ చెబుతున్నాడు. వార్తల కెక్కుతున్న ఇలాంటి చిన్నారుల్ని మనం టెలివిజన్‌ షోలలో కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ప్రాథమిక సమాచారం, అవగాహన, ప్రవచన కారులకు ఏమైనా ఉందా? గమనించండి. వారి దగ్గరున్న పాత సామాను తెచ్చి మన దగ్గర 'సరుకు' చేసుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా? చిన్నపిల్లలు ఇన్ని తెలివి తేటలు ప్రదర్శించ గలుగుతున్నారంటే ఎలా సాధ్యమవుతూ ఉందీ? ఒకటి- జన్యుశాస్త్ర రీత్యా వారసత్వ లక్షణాల వల్ల. రెండు- తల్లిదండ్రులిస్తున్న ప్రోత్సాహం వల్ల. మూడు- బాల్యంలో దొరికిన మంచి ఉపాధ్యాయుల వల్ల ఇలాంటివి సాధ్యం!! నేర్చుకోవడం, అభ్యాసం చేయడం, ఇది మానసిక ఆరోగ్యంలో భాగం. అంతేగాని ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, కరుణా కటాక్షాల వల్లనో కాదు. పిల్లలతో భారతం- భాగవతం పద్యాలు వల్లె వేయిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందేమో గాని, ఈ కాలానికి పనికొచ్చే లోకజ్ఞానం, అవగాహన పెరగదు.


ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం అంటూ జనాన్ని మోసగించే అన్ని మతాల మత బోధకులూ మామూలు మనుషులే! గతంలో సాయిబాబా బెడ్‌రూంలో మూడు హత్యలు జరిగి, ముగ్గురు యువకులు చనిపోతే ఆయన ఆత్మశక్తి ఏమైంది? పోలీసులెందుకు రావాల్సి వచ్చింది? విషయాలేవీ బయటికి పొక్కకుండా ఆయన తన రాజకీయ పరిచయాలను ఎందుకు ఉపయోగించుకోవాల్సి వచ్చింది? ఆయన తన ఆత్మశక్తితో విషయాలన్నీ వివరంగా ప్రజలకు చెప్పాల్సింది కదా? విశ్వ రహస్యాల్ని ఛేదిస్తున్న మానవుడికి ఈ మత బోధకుల రహస్యాలు విప్పడం ఒక లెక్కా? అసలైతే రహస్యాలేవీ లేవు. వారివి బూటకాలు, నాటకాలు కాబట్టే సామాన్యుల్ని సంశయంలో పడేస్తున్నారు. అన్ని మతాల మతబోధకులు కొంత ఖగోళ శాస్త్రం, కొంత జీవ శాస్త్రం, కొంత రసాయన శాస్త్రం, పరిణామ శాస్త్రంలోని కొన్ని ప్రాథమిక అంశాలు చదువుకొంటే బాగుంటుంది. అవి తెలుసుకోకుండా ఇప్పుడు వారు చెప్పేదేమీ లేదు. ఏదో చెప్పాలన్న ఉబలాటం గురువులకు, ప్రవచనకారులకు ఉంటే ఉండొచ్చు. అది వారి బలహీనత- సామాన్య జనానికి ఇప్పుడు వారికన్నా ఎక్కువ విషయాలే తెలుసు. మరోపని లేక ప్రవచన- కాలక్షేపానికి వెళ్లి కూర్చునే వారు కొందరైతే, ఆ పంతులు గారికెంత తెలుసో చూద్దాం అని వెళ్లేవారు కొందరు. పాత సారాని కొత్త సీసాలో ఏమైనా పోస్తున్నారా? పాత పురాణాలకు కొత్త ఆధునిక విశ్లేషణలేమైనా ఇస్తున్నారా? అని ఆలోచించే వారు కొందరు. ఇలా నానా రకాల వాళ్లుంటారు.


ఈ తరం వారు యాబై ఏళ్లు వస్తేగాని ఎల్‌ఈడి టీవీ చూడలేకపోయారు. ఇప్పటి పిల్లలు పుట్టుకతోనే చూడగలుగుతున్నారు. విశ్వ విజ్ఞానాన్ని తమ స్వంతం చేసుకుంటూ ఎదుగుతున్నారు. మరి ఇంకా ఎందుకండీ రాముడి కథలూ, భీముడి కథలూ, అభూత కల్పనలూ? వ్యక్తిత్వ వికాసానికి విషయాలు కావాలంటే ప్రపంచ చరిత్రలో నీతిపరులు, నిజాయితీ పరులు, పోరాట వీరులు, త్యాగాధనులు ఎంతో మంది ఉన్నారు. పురాణ పురుషుల వ్యక్తిత్వాలు-చెప్పుకునేవారికి కాలక్షేపమేగానీ, వినే వారికి వాటివల్ల ఉపయోగం లేదు. ఈ కాలంలో పిల్లలు జై హనుమాన్‌ను సూపర్‌మ్యానులా చూస్తున్నారు తప్పితే, వెనకటి రోజుల్లో లాగా భక్తి భావమూ, తన్మయత్వమూ ఉండడం లేదు. ఇక ఈ ప్రవచనకారులు వారి ధోరణి మార్చుకుని, పర్యావరణ పరిరక్షణ గురించి, ధరిత్రీ దినోత్సవం గురించి మాట్లాడాలి. ధరిత్రీ దినోత్సవం ఎప్పుడు ఎందుకు జరుపుకోవాలి లాంటివి చెపితే సమాజానికి మేలు చేసినవారౌతారు. జన్మలు, పునర్జన్మలు, అతీంద్రియ శక్తులు, క్షుద్ర శక్తులు వంటివి బోధించకుండా విశ్వాంతరాళం గురించి అధ్యయనం చేసి జనానికి చెప్పాలి. మనం చెప్పుకునే పుక్కిటి పురాణాలకు, సైన్సు సిద్ధాంతాలకు ఎక్కడ తేడా వస్తోంది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారెంత నెత్తీ నోరూ బాదుకున్నా ఆ పురాణ పాత్రల్లో ఏ ఒక్కటీ కూడా సజీవంగా ఈ ప్రపంచం లోకి రాదు-వారిని బొందితో స్వర్గానికి తీసుకుపోదు. అందువల్ల వారు కాస్త మనుషుల్ని మనుషుల్లా చూస్తు, తాము కూడా మానవమాత్రులమేనన్న వాస్తవాన్ని జీర్ణించుకోవాలి.


మత పెద్దలు ఒకప్పుడు సైన్సు ఎదగకుండా శాస్త్రజ్ఞుల్ని మట్టుబెట్టారు. వారి ఆధిక్యతను ప్రశ్నించినందుకు చంపేశారు. అదంతా గతం. ఇప్పుడు ప్రశ్న బలపడింది. జవాబులు చెప్పగలగాలంటే నిరంతర అధ్యయనం, పరిశీలన, పరిశోధన అవసరం. జ్ఞానానికి కూడా అర్థం మారింది. అందువల్ల మత బోధకులే మతాల అడ్డుగోడల్ని కూలగొట్టే పని ప్రారంభిస్తే మంచిది. అప్పుడు జనం స్వచ్ఛందంగా ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటారు. ప్రేమలు పెంచుకుంటారు. ఆత్మీయతను పంచుకుంటారు. ఆ ప్రయత్నంలో విశ్వ మానవ గీతికను పాడుకుంటారు. 


(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, సైన్స్‌ ప్రొఫెసర్‌)