కీళ్లనొప్పులు వేధిస్తున్నా.. నమ్మిన దైవం యేసుక్రీస్తు తన బాధలు తొలగిస్తాడని విశ్వసించింది. 20ఏళ్లుగా చికిత్స తీసుకోకుండా జీస్సపైనే భారంవేసి కాలం వెళ్లదీస్తోంది. వ్యాధి ముదరడంతో ఆస్పత్రికి తీసుకెళ్లినా చికిత్సకు సహకరించలేదు. దేవుని పట్ల ఆమె పెంచుకున్న ప్రగాఢమైన నమ్మకాన్ని గుర్తించిన డాక్టర్ తానే జీస్స అనిచెప్పి చికిత్స అందిస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం కొత్తపాడుకు చెందిన పుల్లగూర మరియమ్మ(55) క్రీస్తుని నమ్మి నిత్యం ప్రార్థనా మందిరానికి వెళుతుంది. ఆమె 20ఏళ్లుగా కీళ్లవాతంతో బాధపడుతోంది. వ్యాధి తీవ్రతతో మోకాళ్లు, మోచేతులు బిగుసుకుపోవడంతో.. భర్త బాలశౌరి ఆమెను జీజీహెచ్కు తరలించారు. అక్కడా ఆమె చికిత్సకు నిరాకరించింది. విషయం తెలుసుకున్న న్యూరాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గాజుల రామకృష్ణ ఆమె వద్దకెళ్లి ‘మరియమ్మా లే.. నేను నీ యేసును వచ్చాను! నీ భక్తికి మెచ్చి ఈ డాక్టర్ రూపంలో చికిత్స చేసేందుకు వచ్చాను. బుద్ధిగా మందులు వేసుకో..’ అంటూ ఆమె చెవిలో చెప్పారు. ఇంకేముంది.. తనకోసం ఏకంగా జీసస్ వచ్చాడని భావించిన బాధితురాలు చక్కగా చికిత్సకు సహకరిస్తోంది. కాగా, న్యూరాలజీ విభాగాధిపతి ఎన్వీ సుందరాచారి నేతృత్వంలో రామకృష్ణ, పీజీ విద్యార్థిని మైత్రి ఆమెకు పరీక్షలు చేయించి కీళ్లవాతం తీవ్రస్థాయిలో ఉందని నిర్ధారించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ‘మరియమ్మకు కీళ్లు, ఎముకలు బిగుసుకుపోవడంతో ఆపరేషన్ చేసి కదలికలు తేలికచేసేందుకు ఆర్థోపెడిక్ వార్డుకు తరలిస్తాం’ అని రామకృష్ణ తెలిపారు.
No comments:
Post a Comment